మేడ్చల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మాదారంలో ఇండస్ట్రియల్(పారిశ్రామికవాడ) పార్క్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇండస్ట్రియల్ ఏర్పాటుకు భూమి ఇచ్చిన రైతులకు భూ పరిహారం అందించేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్ భూ పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని మాదారం రైతులతో కలిసి ప్రారంభించారు. 225 సర్వే నంబర్లో 171, 9 గుంటల భూమికి 104 మంది లావుని పట్టా రైతులకు సంబంధించి ఎకరాకు రూ. 32 లక్షల చొప్పున.. రూ. 59.79 కోట్లు భూ పరిహారం ప్రభుత్వం అందిస్తున్నది. శుక్రవారం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం భూ పరిహారం జమ చేస్తుంది. ఇదే 225 సర్వే నంబర్లో ఉన్న మరో 57 ఎకరాలకు సంబంధించిన భూ సేకరణను పూర్తి చేసి త్వరలోనే అవార్డు(నోటిఫికేషన్)జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మరొక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాదారం భూములు ఇండస్ట్రియల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు టీఎస్ఐఐసీ నిర్ధారించడంతో రెవెన్యూ అధికారులు 225 సర్వే నంబర్లోని లావుని పట్టా భూములను సేకరించారు. ఇందుకు సంబంధించి రైతులకు ఇచ్చే భూ పరిహారం చెల్లింపులు వారం రోజుల్లో పూర్తి కానున్నది. ఈ భూమిని టీఎస్ఐఐసీకు బదలాయించే ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు డీఆర్వో లింగ్యానాయక్ తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: మంత్రి మల్లారెడ్డి
పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో భూ పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలో అత్యధిక పరిశ్రమలు ఏర్పడి రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులను మంత్రి మల్లారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి, డీఆర్వో లింగ్యా నాయక్, ఆర్డీవో రవి ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.