బంజారాహిల్స్.జూన్ 30: ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజీపీకి గట్టి షాక్ తగిలింది. ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి బీజేపీ తరపున ఎన్నికైన డేరంగుల వెంకటేష్ గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో కమలం పార్టీలో కలకలం చెలరేగింది. 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ తరపున అభ్యర్థిగా నిలబడిన చింతల రాంచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని మొత్తం ఆరు డివిజన్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో బీజేపీ కుదేలయింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చింతల రాంచంద్రారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో మరోసారి బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. కాగా ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు రెండు సీట్లలో విజయం సాధించారు.
జూబ్లీహిల్స్,హిమాయత్నగర్లో టీఆర్ఎస్ మీద స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి గెలిచిన డేరంగుల వెంకటేష్ తాజాగా టీఆర్ఎస్లో చేరడంతో మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీలో అంతర్గతంగా వర్గపోరు నడుస్తోంది. చింతల రాంచంద్రారెడ్డి వైఖరిపై బహిర్గతంగానే విమర్శలు గుప్పిస్తున్న బీసీ వర్గానికి చెందిన పల్లపుగోవర్ధ్దన్తో పాటు హిమాయత్నగర్కు చెందిన సీనియర్ బీసీ నేత కూడా పార్టీలో బీసీలపై అణిచివేత దోరణులపై ఆసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు బీజేవైఎమ్లో జాతీయస్థాయిలో కీలకంగా ఉన్న మరో నేత కూడా ఖైరతాబాద్ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ కార్పొరేటర్ పార్టీకి గుడ్బై చెప్పడంతో నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితిని మరింత దిగజార్చినట్లే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.