సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన పక్కనే ఉన్న చారిత్రాత్మకమైన ప్రభుత్వ దంత వైద్యశాల కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందిస్తోంది. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఈ దంత కళాశాల, వైద్యశాలకు దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రభుత్వ దంత కళాశాల సీనియర్ వైద్యనిపుణులు, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాన్టిక్స్ విభాగాధిపతి డాక్టర్ సర్జీవ్సింగ్ యాదవ్ చెప్పారు. ప్రతిరోజూ ఇక్కడ 1200 నుంచి 1500 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారన్నారు.
రోజూ 60 మందికి…
దంతానికి సంబంధించిన నరాలు, రక్తకణాలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఆ పన్ను పుచ్చిపోవడం లేదా దెబ్బతింటుంది. గతంలో ఈ సమస్య ఉన్నవారికి పాడైన పంటిని తొలగించేవారు. అయితే రూట్కెనాల్ విధానంలో ఇన్ఫెక్షన్కు గురైన పంటి భాగాన్ని తొలగించి, దెబ్బతిన్న నరాలు, రక్తకణాలకు చికిత్స చేసి ..ఆ పంటికి క్యాప్ వేస్తారు. దీని వల్ల రోగికి దంతాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదని డాక్టర్ సర్జీవ్సింగ్ యాదవ్ తెలిపారు. ప్రతి రోజూ కనీసం 60 మందికి రూట్కెనాల్ చేస్తున్నట్లు వివరించారు.
అత్యాధునిక వైద్యపరికరాలు
ప్రభుత్వ దంత వైద్యశాలలో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ‘ఆపరేటింగ్ మైక్రోస్కోపి’, సీవీసీటీ, ఓపీజీ-ఎక్స్రే వంటి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సుమారు రూ.12 లక్షల విలువైన ఆపరేటింగ్ మైక్రోస్కోపి ద్వారా 1మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న గాయం లేదా ఇన్ఫెక్షన్ లేదా పంటి భాగాన్ని 30 రెట్లు పెద్దగా చేసి చూస్తారు. దీని వల్ల సమస్యను క్షుణ్ణంగా గుర్తించి కచ్చితమైన చికిత్స అందించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. సీవీసీటీ ద్వారా దంతాలకు సీటీ-స్కాన్ చేసి క్యాన్సర్, పన్ను ఫ్రాక్చర్, ఇన్ఫెక్షన్ వంటి వాటిని నిర్ధారిస్తామన్నారు. సుమారు రూ.60 లక్షల వ్యయంతో సీవీసీటీ యంత్రాన్ని ఇటీవలే మంజూరు చేసినట్లు డాక్టర్ సర్జీవ్సింగ్ యాదవ్ తెలిపారు. వీటితో పాటు ఓపీజీ-డిజిటల్ ఎక్స్రే కూడా అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం
దంత చికిత్స, దంత సమస్యల నిర్ధారణ పరీక్షలు ఖరీదైనవి. ముఖ్యంగా రూట్కెనాల్ థెరపీకి కార్పొరేట్లో అయితే సుమారు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అవుతుంది. ఇది చికిత్సకు మాత్రమే. వైద్యపరీక్షలు, రూట్కెనాల్ తర్వాత మందులు ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.10వేల వరకు ఖర్చవుతుంది. ఇంతటి ఖరీదైన రూట్కెనాల్ థెరపీని ప్రభుత్వ దంత వైద్యశాలలో పైసా ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా అందిస్తున్నాం.
– డా.సర్జీవ్సింగ్ యాదవ్, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్, ఎండోడాన్టిక్స్విభాగాధిపతి