చంద్రయాణగుట్ట, జూన్ 29: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితులను చాంద్రయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ బుధవారం స్థానిక పీఎస్లో తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి గ్రామం ఏక్నంబర్ రోడ్డు ప్రాంతానికి చెందిన ముబారక్ ఖురేషీ (19) చాంద్రయణగుట్టకు చెందిన షహాజ్ (19) స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వారు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి విక్రయించాలనుకున్నారు. చాంద్రయణగుట్ట పీఎస్ పరిధిలో ఖురేషీ ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తుండగా షహాజ్ సహకరిస్తుండేవాడు.
బుధవారం చాంద్రయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాంతంలో డీఐ మధుసూదన్రెడ్డి, డీఎస్ఐ హరీశ్కుమార్ వాహనాలు తనిఖీ చేస్తుండగా, ద్వి చక్రవాహనంపై వచ్చిన నిందితులు పత్రాల గురించి పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెల్లడించారు. వారి నుంచి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఖురేషీపై బాలాపూర్ పోలీస్ స్టేషన్లో పోక్సో, బాల్య వివాహానికి సంబంధించిన కేసులున్నాయని తెలిపారు. షహాజ్పై ఫలక్నుమా పోలీస్స్టేషన్లో ఓ కేసు నమోదై ఉందన్నారు. మరో ఘటనలో ఫలక్నుమా వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అమేర్(23)ను పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు బైక్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి ఏసీపీ షేక్ జహంగీర్ రివార్డులను ప్రకటించారు. ఈ సమావేశంలో చాంద్రయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు.