కవాడిగూడ, జూన్ 29 : నిరుద్యోగులు జాబ్ మేళాల్లో ఉద్యోగాలు సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర సూచించారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్లోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్ ముషీరాబాద్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. ఇందులో దాదాపు 22 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 986 మందికి వివిధ కంపెనీలలో నియామకాలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం డీసీపీ రాజేశ్ చంద్ర, అదనపు డీసీపీ రమణారెడ్డిను ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్. మోహన్ రావు, డీఐ వెంకన్న, ఎస్ఐలు సురేందర్, స్వప్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.