సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హజరవుతున్న సందర్భంగా గచ్చిబౌలీ హెచ్ఐసీసీ(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) పరిసరాల చుట్టు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు, మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్, పారా ైగ్లెడర్స్ ఎగుర వేయడాన్ని నిషేధిస్తు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆంక్షల నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. ఈ ఆంక్షలు జూన్ 30 ఉ.6 గంటల నుంచి జూలై 4 సా.6 గంటల వరకు అమల్లో ఉంటాయని అన్నారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188, సెక్షన్ 121, 121(ఏ), 287, 336, 337, 338 ఐపీసీ కింద చట్టపరంగా చర్యలు ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు సచివాలయం చుట్టూ 5 కిలోమీటర్లు, ఇతర ప్రధాన కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లోని చుట్టూ 2 కిలోమీటర్ల దూరంలో వీటిని ఎగుర వేయడం నిషేధించామని సీపీ రవీంద్ర పేర్కొన్నారు.