సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : మహిళ ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ శిశువు వైకల్యంతో జన్మించింది. దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. నాగర్కర్నూల్ సమీప గ్రామానికి చెందిన ఓ మహిళ గర్భధారణ అనంతరం 6వ వారం నుంచి హైదరాబాద్లోని ఫెర్నాండేజ్ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకున్నది.
మొదటికాన్పులో తనకు సిజేరియన్ జరిగినట్లు వైద్యులకు తెలిపింది. 2019 ఫిబ్రవరి 14న వైద్యుల సూచనల మేరకు రూ.50 వేలు ఆసుపత్రికి అడ్వాన్స్ చెల్లించి వైద్యశాలలో చేరింది. అయితే ప్రసవ సమయంలో తానే ఉంటానని చెప్పిన వైద్యురాలు రాలేదు. దీంతో ఇతర వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు సాధారణ ప్రసవం కోసం ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 2019 ఫిబ్రవరి 15న తెల్లవారుజామున అత్యవసర సిజేరియన్ చేశారు. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించిన సమయంలో ఆమె వెన్నెముకపై ప్రభావం పడి తీవ్ర నొప్పికి గురైంది.
మొదటి సిజేరియన్ కుట్లు కూడా ఊడిపోయాయి. అంతేకాకుండా శిశువు జన్మించిన కొద్దిసేపటి నుంచి అనేక రుగ్మతలు బయటపడ్డాయి. ప్రసవ సమయంలో ఆక్సిజన్ సరిగా అందక శిశువు వైకల్యంతో జన్మించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. వివిధ వైద్య నివేదికలు పరిశీలించిన వినియోగదారుల కమిషన్-2 అధ్యక్షులు నరసింహరావు, సభ్యులు జవహర్బాబు బెంచ్ బాధితురాలికి సదరు వైద్యశాల యాజమాన్యం రూ.60 లక్షల నష్టపరిహారం, రూ.20వేలు అదనంగా ఖర్చుల కోసం చెల్లించాలని తీర్పును వెలువరించారు.