సిటీబ్యూరో,జూన్ 29 (నమస్తే తెలంగాణ): నగరంలో పేరొందిన పర్యాటక కేంద్రాలైన లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్లను సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. దాదాపు 20 ఏళ్ల కిత్రం ఈ పార్కులను అభివృద్ధి చేశారు. నాటి నుంచి ఇప్పటివరకు పెద్దగా మార్పులు చేయలేదు. సందర్శకులు గణనీయంగా పెరిగినా ఆయా పార్కుల్లో కొత్తదనంతోపాటు మౌలిక వసతులు ఆకర్షించేలా లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు పార్కులను నేటి తరం అభిరుచులకు అనుగుణంగా, అత్యాధునిక ల్యాండ్స్కేపింగ్తో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న రెండుపార్కులకు కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ప్లాన్ను రూపొందించేందుకు ల్యాండ్ స్కేపింగ్ ఆర్కిటెక్ట్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది. ఎంపికైన తర్వాత 30 రోజుల వ్యవధిలో 3రకాల నమూనాలతో మాస్టర్ప్లాన్ను రూపొందించి అందజేయాల్సి ఉంటుంది. మొత్తంగా 6 నెలలపాటు ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన ల్కాండ్ స్కేపింగ్ ఆర్కిటెక్ట్లు పనిచేయాల్సి ఉంటుంది.