అమీర్పేట్, జూన్ 29: జూలై 4 నుంచి ప్రారంభమయ్యే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఉత్సవం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. వేడుకలను పురస్కరించుకుని బుధవారం ఉదయం మంత్రి తలసాని అన్ని శాఖల అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తుల కోసం దేవాలయం వెనుక వీధిలో రూ. 3.20 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన విడిదిని మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, ఈవో ఎస్.అన్నపూర్ణతో కలిసి ప్రారంభించారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో 4న ఉత్సవాలు ప్రారంభమై, 5న అమ్మవారి కల్యాణం, 6న జరిగే రథోత్సవం నుంచి వేడుకల ముగింపు వరకు బల్కంపేట దేవాలయ పరిసరాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సంబంధిత అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు దాదాపు 5 లక్షల మంది విచ్చేస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, స్ట్రీట్లైట్స్ ఈఈ వెంకటేశ్, జలమండలి ఈఎన్సీ కృష్ణ, జీఎం హరిశంకర్, పంజాగుట్ట ఏసీపీ గణేశ్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, ఆర్ అండ్ బీ ఈఈ రవీందర్, ట్రాన్స్కో డీఈ సుధీర్, ఆర్టీసీ డీవీఎం శ్యామల, టీఆర్ఎస్ నాయకులు కొలను బాలరెడ్డి దేవాలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
4600 పట్టు పురుగుల వినియోగంతో… ఎల్లమ్మకు పసుపు, ఎరుపు రంగు చీర..
5న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి ఉపయోగించే చీర తయారీ బుధవారం దేవాలయ ఆవరణలో ప్రారంభమైంది. పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి, సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ఎస్.ఎస్.జైరాజ్ ఆధ్వర్యంలో ఈ చీర రూపుదిద్దుకుంటున్నది. బుధవారం ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మగ్గంపై అమ్మవారి చీర తయారీని ప్రారంభించారు. అమ్మవారి కల్యాణ ఉత్సవానికి ఉపయోగించే ఈ చీరను 4,600 పట్టు పురుగులతో తయారు చేస్తున్నామని, ఈ చీరను పసుపు, ఎరుపు, ఆకు పచ్చ, బంగారు రంగులతో తయారు చేస్తున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ చీర అంచులో నెమళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
బుధవారం ప్రారంభమైన ఈ చీర నేత పనులు.. 4వ తేదీ సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్ల సమయానికి పూర్తవుతుందన్నారు. ఈ చీరను ఆలయ అధికారులకు అందజేస్తామని తెలిపారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక దేవాలయాల్లోని దేవతలకు వస్ర్తాలు నేశామన్నారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి చీర నేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు. బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చీర తయారీ విధానాన్ని పరిశీలించారని చెప్పారు. ఈ చీర తయారీలో చేనేత కళాకారులు కోమటి సత్యనారాయణ, రాపోలు గణేశ్, ఈడం వెంకటేశ్, కంది విశ్వనాథ్, చింతకింది జానయ్య, రచ్చ నాగరాజు, దేవేందర్లు పనిచేస్తున్నారన్నారు.