బంజారాహిల్స్, జూన్ 29: బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం వద్ద జూలై 1 నుంచి 10 వరకు జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా రెండేండ్లుగా జగన్నాథ రథయాత్రను ఆలయం లోపలే నిర్వహించారు. ఈసారి భారీఎత్తున యాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగన్నాథ రథయాత్ర కోసం రథాలను తీర్చిదిద్దుతున్నారు. జూలై 1న ఉదయం 9 గంటలకు స్వామివారిని రథంపైకి చేరుస్తారు.
ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు రథంపై కొలువుదీరిన జగన్నాథుడు, భలభద్రుడు, సుభద్రాదేవిలను భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రథయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. రథయాత్రను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 11న ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.