ఖైరతాబాద్, జూన్ 28 : మా పార్టీ సభ్యత్వం తీసుకుంటే 50 గజాల స్థలం ఫ్రీ అంటూ ఓ పార్టీ రవీంద్రభారతి రోడ్డు, ఆర్బీఐ పక్కన ఓ కొత్త దుకాణాన్ని తెరిచింది. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి మరీ సభ్యత్వాలు నమోదు చేయించుకుంటుంది. వారిచ్చే ఆఫర్లకు ఆశపడి కొందరు సభ్యత్వాలు కూడా తీసుకుంటున్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి నగరంలోని శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ప్లాట్లు ఉచితంగా ఇస్తామని సదరు పార్టీ ప్రచారం చేయడంతో భారీ సంఖ్య ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఆధార్ కార్డు, కరెంటు బిల్లుల జిరాక్సు కాపీలు తీసుకువచ్చి మరీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఓ రశీదును అందించి చేతులు దులుపుకున్నారు. కాగా, పార్టీ సభ్యత్వంపై పలు విమర్శలు తలెత్తున్నాయి. ఓటర్లకు తాయిలాలు అందించి సభ్వత్వం ఇవ్వాలనుకోవడం చట్టరీత్యా నేరమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై లిఖిత పూర్వంగా ఫిర్యాదు రాలేదని, డయల్ 100కు మాత్రం ఫోన్కాల్స్ వచ్చినట్లు సైఫాబాద్ ఎస్సై ఒకరు చెప్పారు.