ఖైరతాబాద్, జూన్ 28 : ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. సొంత కాళ్లపై బతికేందుకు నగరానికి వచ్చారు. జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త.. భార్యను కడతేర్చి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్నగర్లో చోటు చేసుకుంది. డీఐ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం… అసోంకు చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కార్ ప్రేమించి రెండేండ్ల కిందట పెండ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. 20 రోజుల కిందట ప్రేమ్నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ జీవీకే మాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. కాగా, గత మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంపను బకెట్లో ముంచి చంపి, మహానంద సోమవారం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం లక్డీకాపూల్- నాంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య లభించిన మహానంద మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించే క్రమంలో అతడి జేబులో ఓ పాకెట్ డైరీ లభించింది. అందు లో అసోం భాషలో లేఖ రాసి ఉంది. నాంపల్లి పోలీసులు ఆ భాష తెలిసిన వారి ద్వారా ఆరా తీయగా, భార్య పంపను హత్యచేసి, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో రాసి ఉంది. దీంతో వెంటనే నాంపల్లి పోలీసులు ప్రేమ్నగర్కు చేరుకొని తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూడగా, బకెట్లో తల ముంచి విగత జీవిగా పంప సర్కార్ పడి ఉంది. దీంతో, నాంపల్లి పోలీసులు పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి ఏసీపీ పీవీ గణేశ్, డీఐ నరసింహ, క్లూటీమ్ బృందాలు చేరుకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గలకారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు.