మన్సూరాబాద్, జూన్ 28: కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు ఆస్తి కోసం వారిని మానసిక క్షోభకు గురి చేశాడు. వృద్ధులని కూడా చూడకుండా నిత్యం వేధించాడు. కొడుకు పెడుతున్న హింసను భరించలేక ఆ వృద్ధ దంపతులు కలెక్టర్ను ఆశ్రయించారు. ఈ ఘటన మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, సరూర్నగర్ మండల రెవెన్యూ అధికారులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్నగర్ కాలనీలో కావేటి కౌసల్యాదేవి, లింగమయ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె రత్నమాల, కుమారులు చంద్రశేఖర్, రాజశేఖర్ ఉన్నారు. ఈ ముగ్గురికీ వివాహాలు జరిగాయి.
పెద్ద కుమారుడైన చంద్రశేఖర్ భార్యా, పిల్లలతో కలిసి ఇంటికి దూరంగా ఉంటున్నాడు. తల్లి కౌసల్యాదేవి పేరుపై 266 గజాల ఇంటి స్థలం ఉంది. ఆ స్థలంలో నుంచి 153 గజాల స్థలాన్ని పెద్ద కుమారుడైన చంద్రశేఖర్కు గిఫ్ట్ డీడీగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించింది. మిగిలిన 113 గజాల స్థలంలో నిర్మించి ఉన్న ఇంటిని చిన్న కుమారుడైన రాజశేఖర్కు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. కౌసల్యాదేవి, లింగమయ్య దంపతులు ఇద్దరు చిన్న కుమారుడి వద్దే ఉంటున్నారు. అన్నకు గిఫ్ట్ డీడీ ద్వారా ఇచ్చిన 153 గజాల స్థలంతో పాటు వృద్ధుల వద్దనున్న 10 తులాల బంగారు నగలు, రూ. లక్ష నగదును కాజేయాలని పథకం వేశాడు. ముందుగా సహారాస్టేట్స్కాలనీ సమీపంలో ఉన్న ఓ బ్యాంకులో రాజశేఖర్ తన తల్లి కౌసల్యాదేవితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాడు.
బ్యాంకు లాకర్లో 10 తులాల బంగారు నగలు పెట్టాడు. లక్ష రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, అందుకు సంబంధించిన బాండ్లను లాకర్లో దాచాడు. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా తాను మాత్రమే నడిపే విధంగా రాజశేఖర్ చేసుకున్నాడు. తన సోదరుడైన చంద్రశేఖర్కు గిఫ్ట్ డీడీ ద్వారా ఇచ్చిన 153 గజాల స్థలాన్ని తిరిగి తన తల్లి పేరుపై మార్పించాడు. తల్లి పేరు మీద ఉన్న మొత్తం 266 గజాల స్థలంతో పాటు బ్యాంకులో ఉన్న 10 తులాల బంగారు నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన తల్లిదండ్రులు చిన్న కుమారుడికి ఎదురు తిరిగారు. దీంతో, అతడు ఆస్తి తనకు చెందకుండా చేస్తున్నారని తల్లిదండ్రులపై ఆగ్రహం పెంచుకొని చిత్రహింసలు పెట్టాడు.
ఆ వృద్ధ దంపతులు 23 సెప్టెంబర్ 2021న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో రాజశేఖర్పై కేసు పెట్టారు. అనంతరం కందుకూరు ఆర్డీవోతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ దంపతుల ఫిర్యాదును పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈనెల 17న ఆదేశాలు జారీ చేశారు. కౌసల్యాదేవి, లింగమయ్య దంపతులు గతంలో నివాసం ఉంటున్న ఇంటితో పాటు బ్యాంకులో ఉన్న 10 తులాల బంగారు నగలు, లక్ష రూపాయల విలువజేసే ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను వారికే ఇప్పించాలని కందుకూరు ఆర్డీవో, రాచకొండ పోలీసు కమిషనరేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో సరూర్నగర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదగిరి, ఎల్బీనగర్ పోలీసు సిబ్బందితో కలిసి శ్రీరామ్నగర్కాలనీకి చేరుకున్నారు. అధికారుల రాకను ముందుగానే పసిగట్టిన రాజశేఖర్ ఇంటికి తాళం వేసి కటుంబంతో కలిసి పరారయ్యాడు. న్యాయం చేయాలంటూ ఆ దంపతులు ఇంటి ముందు బైఠాయించారు. సరూర్నగర్ మండల ఆర్ఐ యాదగిరి మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీరామ్నగర్కాలనీలోని ఇంటిని వృద్ధ దంపతులకు అప్పగించేందుకు వచ్చామన్నారు. ఇక్కడికి వచ్చేసరికే రాజశేఖర్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.