పని వేళల్లో కార్మికులకు బ్రీత్ ఎన్లైజర్ టెస్టు
పట్టుపడితే విధుల నుంచి తొలగింపు
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ వినూత్న చర్య
తప్పుతున్న ప్రమాదాలు
మేడ్చల్ రూరల్, జూన్ 28: మద్యం తాగి విధుల్లోకి వచ్చే కార్మికులపై గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కొరఢా ఝులిపిస్తోంది.కార్మికుల సంక్షేమం, ప్రమాదాల నివార ణే లక్ష్యంగా వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్రీత్ ఎన్లైజర్ వినియోగంతో మద్యం తాగిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఈ ప్రయోగం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సత్ఫలితాలు కన్పిపిస్తున్నాయి. కార్మికులు మద్యానికి దూరంగా ఉంటున్నారు.
ప్రమాదాల అడ్డుకట్టకు…
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 120 మంది కార్మికులు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. వారిలో చాలా మంది మద్యం తాగి, విధుల్లోకి వస్తున్నారు. దీంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు.మద్యం తాగి న వారు తమతో పాటు ఎదుటువారిని సైతం ఇబ్బందికి గురి చేస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా మద్యం తాగడం మానడం లేదు. మద్యం తాగిన డ్రైవర్ కేవీ రెడ్డినగర్లో ఆటోను పల్టీ కొట్టించడంతో చేతికి తీవ్ర గాయమైంది. వేళ్లు కదలికలను కోల్పోయి పని చేసుకోలేదని పరిస్థితి ఏర్పడింది. మరో డ్రైవర్ గేటెడ్ కమ్యూనిటీలోకి ట్రాక్టర్పై వెళ్తూ కారు ఢీకొట్టాడు. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. చైర్పర్సన్ జోక్యం చేసుకొని, సొంత డబ్బుతో కారును బాగు చేయించాల్సి వచ్చింది. మరో ఘటనలో ఇంకో డ్రైవర్ ట్రాక్టర్ను తప్పుడు దారిలో ఆటోను ఢీ కొట్టింది. ఇలాంటి ఘటనలు పాలకర్గం, అధికారులకు తలనొప్పిగా మారాయి. దీన్ని తీవ్రంగా పరిగణించి, బ్రీత్ ఎన్లైజర్ ప్రయోగానికి తెరతీశారు.
పట్టుబడితే కఠిన చర్యలు
మద్యం తాగి విధుల్లోకి వచ్చే వారిని బ్రీత్ ఎన్లైజర్ ద్వారా గుర్తిస్తే మొదటి నెల రోజులు విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అలాగే రెండో సారి పట్టుబడితే రెండు నెలలు, మూడోసారి అదే కొనసాగిస్తే శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. బ్రీత్ ఎన్లైజర్ అమలును మున్సిపాలిటీ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో ఇన్విరాన్మెంటల్ ఇంజినీరు నర్సింహ రెడ్డిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు మైసమ్మగూడ, కండ్లకోయ, గుండ్లపోచంపల్లి, బాసరేగడిలో కార్మికుల హాజరు తీసుకుంటారు. ఉదయం విధుల్లోకి వచ్చిన వారు విధులు ముగిసే సాయంత్రం 5 గంటల వరకు కార్మికులను పర్యవేక్షిస్తారు. వివిధ వార్డుల్లో పర్యటిస్తూ బ్రీత్ ఎన్లైజర్ను వినియోగిస్తున్నారు. దీంతో కార్మికుల్లో మార్పు వస్తోంది. మద్యం తాగి విధుల్లోకి రావడానికి జంకుతున్నారు.
కార్మికుల్లో మార్పు వస్తోంది
బ్రీత్ ఎన్లైజర్ ప్రయోగంతో కార్మికుల్లో మార్పు వస్తోంది. మద్యానికి దూరంగా ఉంటున్నారు. వినియోగంలోకి తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే అనుకున్న ఫలితాన్ని సాధించండం సంతోషంగా ఉంది. ప్రమాదాల నివారణ, కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. కార్మికులు విధు ల్లో మద్యానికి దూరంగా ఉంటే కుటుంబానికి, సమాజానికి మంచిదన్న విషయాన్ని గుర్తించాలి.
–మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి
పట్టణ ప్రగతిలో గుర్తించాం..
పారిశుధ్య కార్మికుల్లో కొంత మంది తాగి వస్తున్నట్టు తన దృష్టికి వచ్చింది. పట్టణ ప్రగతి లో వార్డుల్లో పర్యటిస్తుండగా ఉదయం 9 గంటలకే తాగి విధుల్లోకి వచ్చినట్టు గుర్తించాను. అంతేగాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. దీన్ని అరికట్టేందుకు డ్రంక్ డ్రైవ్గా నిర్వహించాలని బావించాను. ఈ విషయాన్ని చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా అమలుకు ఆమోదం తెలిపారు. సమష్టి కృషితో మద్యం వినియోగం నియంత్రణలోకి వచ్చింది.
–రాములు, కమిషనర్, గుండ్లపోచంపల్లి