మణికొండ, జూన్ 27 : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెడుతూ, రోగులకు, రోగి సహాయకులకు ఉచితంగా భోజనాన్ని అందించే బృహత్తరమైన కార్యక్రమాలను ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. నార్సింగిలోని హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (భోజనామృతం)లో కేంద్రీకృత వంటశాల (సెంట్రలైజ్డ్ కిచెన్)ను 18 ప్రభుత్వ ఆస్పత్రుల ఇన్- పేషెంట్ అంటెండెంట్లు, అవుట్ పేషెంట్లకు నామమాత్రపు ధరకే భోజనం అందించే సదుపాయం కోసం యాంకర్ పాటర్న్ వట్టం రమేశ్బాబు కుటుంబ సభ్యులు, ప్రదీప్గోపాల్ అగర్వాల్ కుటుంబ సభ్యులు రూ.2.5 కోట్ల సాయంతో నిర్మించిన వంటశాలను సోమవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా భోజనామృత, అక్షయపాత్రలో మంత్రి హరీశ్రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి వంటశాలలను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట.. పేరు ఏదైనా హరేరామ, హరే కృష్ణతో కలిసి ప్రభుత్వం లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నదని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యతో దవాఖానలో చేరడమే ఓ నరకమంటే.. ఆకలితో పడుకోవడం ఇంకో నరకమని గుర్తించి ఇలాంటి ఆదర్శప్రాయ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. రోగుల సహాయకుల కోసం ఇప్పటికే నైట్ షెల్టర్లు నిర్మించామని, తాగునీటి వసతులు కూడా కల్పించడం జరిగిందని తెలిపారు.
అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒకపూట ఆకలిని తీరుస్తున్నాయని, అదేవిధంగా 18 ఆస్పత్రుల్లో రోజు సుమారు 20 వేల మందికి ఉచితంగా భోజనామృతం నుంచి భోజనం అందుతున్నదని తెలిపారు. ఒక్కో ప్లేట్ భోజనానికి ప్రభుత్వం రూ.21 సబ్సిడీ ఇస్తున్నదని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 దవాఖానల్లో భోజనం కోసం ప్రభుత్వం ప్రతి యేటా రూ.38.66 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. భోజనం తినడానికి అవసరమైన నీటి సదుపాయాలు, షెల్టర్లను, ఫ్యాన్లు వంటి టీఎస్ఎండీసీ ఏర్పాటు చేసిందని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా.. ఒక్క బెడ్కు ఇచ్చే డైట్ చార్జీలను రూ.56 నుంచి రూ.112కు పెంచామన్నారు. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు రూ.40 నుంచి రూ.80 వరకు పెంచినట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచామని తెలిపారు. వైద్య పరికాల నిర్వహణ కోసం దేశంలోనే తొలిసారిగా బయో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పేరుతో పాలసీ అమలు చేస్తున్నామన్నారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖానలు..
రూ.2,679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఇటీవలే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసినట్లు మంత్రి చెప్పారు. ఓ వైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. మరో వైపు కొత్త ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, వైద్యశాఖ సంచాలకులు రమేశ్రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, బండ్లగూడ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్, కార్పొరేటర్లు సురేశ్గౌడ్, సాగర్గౌడ్, నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ, మాజీ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు శ్రీకాంత్రావు, శివారెడ్డి, విజేత ప్రశాంత్ యాదవ్, డీఈ నర్సింహా రాజు, నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.