కీసర, జూన్ 27: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మండల తాసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఘట్కేసర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాలకు చెందిన 575 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించేందుకు మంత్రి లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తున్నామని, ప్రతి గ్రామానికి 50 నుంచి 70 మంది లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.
పీర్జాదిగూడకు 220 ఇండ్లను ఇస్తామని, ప్రతి పేదవారికి లబ్ధి చేకూరడానికి లాటరీ తీస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. లక్షలాది రూపాయల విలువజేసే భూమిలో పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ స్కీంకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఘట్కేసర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాలకు చెందిన నిరుపేద లబ్ధిదారుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేశామని, లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో లక్కీ డ్రా తీసి వారికి ఇండ్లు అప్పజెప్పడం జరుగుతుందని తెలిపారు.
కీసర లబ్ధిదారులకు తర్వాత ఇండ్లు ఇస్తాం..
కీసరలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసరగుట్టలో ఇండ్లున్న వారి పేర్లు కూడా లిస్టులో ఉండటంతో ఈరోజు వాయిదా వేస్తున్నామని తెలిపారు. కీసరలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కారు, బైక్, ఇల్లు ఉన్నవారికి ఇవ్వమని, ఇండ్లు లేని నిరుపేదలకు మాత్రమే కేటాయిస్తామని తెలిపారు. ఈ ఇండ్లకు సంబంధించి స్థానికంగా ఉన్న పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి లబ్ధిదారుల ఇంటికొచ్చి ఎంపిక చేస్తారని, ఇండ్లు లేనివారికే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో రవికుమార్, కీసర తాసీల్దార్ గౌరీవత్సల, ఘట్కేసర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ ప్రాంతాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ తటాకం నారాయణశర్మ, కీసర మండల సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, నాయకపు వెంకటేశ్, పండుగ శశికాంత్తో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.