బేగంపేట్ జూన్ 27: చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రాంగోపాల్పేట్ మహాత్మా గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్పేట్లోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్లబావి చుట్టూ తిరిగి పనులను పరిశీలించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని ఆదేశించారు. రోడ్డు నిర్మాణానికి ముందే వాటర్, సివరేజ్ లైన్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరంలోని మెట్ల బావులను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు.
మెట్లబావి పరిసరాలను ఎంతో సుందరంగా తీర్చి దిద్దుతామని, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆగస్టు 15 నాటికి పను లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన నిర్మాణాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎన్ని నిధులైనా ప్రభుత్వం ఖర్చు చే స్తుందని తెలిపారు. మహాత్మాగాంధీ వి గ్రహం వద్ద అభివృద్ధి పనులు కూడా ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అరుణ గౌడ్, సి కింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ సుదర్శన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టఫర్, జలమండలి జీఎం రమణారెడ్డి పాల్గొన్నారు.