హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కాల్సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలు వచ్చాయంటూ యువతను మోసం చేస్తున్న నలుగురిని సీసీఎస్ సైబర్క్రైం పోలీసులు అరెస్ట్చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావుభూపాల్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన నితిన్కుమార్, కరణ్ కోహ్లి, ప్రతీక్ మనోహర్ అస్వాల్, యూపీకి చెందిన రాహుల్కుమార్ ఢిల్లీ, ఘజియాబాద్లో కాల్సెంటర్లను ఏర్పాటుచేశారు. నౌకరీ.కామ్, షైన్.కామ్ తదితర జాబ్ పోర్టల్స్ ఉద్యోగాల కోసం నమోదుచేసుకొన్న వారి వివరాలు సేకరించి టెలికాలర్స్ ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. ఉద్యోగార్థి ఏ జాబ్కు ప్రాధాన్యం ఇచ్చాడో, అదే ఉద్యోగానికి ప్రముఖ కంపెనీలో ఎంపికైనట్టు ఫోన్లు చేసి ప్రాసెసింగ్ ఫీజులంటూ లక్షలు కాజేస్తున్నారు.
నల్లకుంటకు చెందిన ఓ యువకుడికి షెల్ పీఎల్సీ ఇండియా కంపెనీలో సీనియర్ మేనేజర్ పోస్టుకు ఏడాదికి రూ.69 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందంటూ సపోర్ట్@స్కిల్స్ హబ్స్.కామ్ నుంచి మెయిల్చేశారు. ఫోన్ చేసి ఉద్యోగానికి ఎంపికయ్యావని నమ్మించి నకిలీ అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. ఉద్యోగంలో చేరేముందు రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్, మెడికల్ చెకప్, ప్రాసెసింగ్ ఫీజుల చార్జీలు చెల్లించాలంటూ పలుదఫాలుగా రూ.5,49,220 కాజేశారు. గాంధీనగర్కు చెందిన యువతికి యాక్సెంచర్ ఐటీ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం వచ్చిందంటూ రూ.1,73,650 దోచేశారు. ఈ మోసాలపై ఫిర్యాదులు అందటంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రమేశ్ బృందం ఢిల్లీలో రెండు కాల్సెంటర్ల నుంచి ఈ మోసాలు జరిగినట్లు గుర్తించి నలుగురిని నిందితులను అరెస్ట్ చేసింది. వీరి నుంచి 16 ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, డెబిట్కార్డులను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ పనిచేస్తున్న టెలికాలర్స్కు కూడా నోటీసులు ఇచ్చారు.