మేడ్చల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 333 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 2022-23 సంవత్సరానికి 91.10 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. వానకాలం ప్రారంభమైన దృష్ట్యా వివిధ చెరువుల్లో 30 శాతం నీరు చేరిన వెంటనే చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది 318 చెరువుల్లో 75.90 లక్షల చేప పిల్లలను వదలగా.. ఈ ఏడాది 9.10 లక్షల చేప పిల్లలను విడుదల చేసేలా మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా వదిలేందుకు ప్రణాళికను త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నామ మాత్రపు కౌలుపై..
తమ ఆధీనంలోని చెరువులను మత్స్య పారిశ్రామిక సంఘాల అభివృద్ధికి నామ మాత్రపు కౌలుపై మత్స్యశాఖ అందిస్తున్నది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 61 ఉండగా.. ఇందులో 3159 సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా 13 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. మత్స్య పారిశామ్రిక సహకార సంఘాల సభ్యుల అభివృద్ధికి చేపలు పట్టేందుకు అవసరమయ్యే పరికరాలను 70 శాతం రాయితీపై మత్స్యశాఖ అందిస్తున్నది.
మహిళా సభ్యులు రంగు చేపల ఉత్పత్తి, చేపల విక్రయాల ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. 2021-22 సంవత్సరంలో 11 మండలాల్లోని చెరువులైన శామీర్పేట్ మండలంలో 86, మేడ్చల్ మండలంలో 99, కీసర మండలం 41, ఘట్కేసర్ మండలం 18, కుత్బుల్లాపూర్ మండలం 6, దుండిగల్ మండలం 46, బాచుపల్లి మండలం 9, అల్వాల్ మండలం 2, ఉప్పల్ మండలం 1, కాప్రా మండలం 7, మేడిపల్లి మండలం 3తో కలిపి 318 చెరువుల్లో చేప పిల్లలు వదలగా.. ఈ ఏడాది అదనంగా మరో 15 చెరువుల్లో చేప పిల్లలను వదలనున్నారు. త్వరలోనే 15 చెరువులను ఎంపిక చేయనున్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు.