సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ) :ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యం, కరోనా తర్వాత పూర్తి స్థాయిలో స్కూళ్లు, కాలేజీలు, కళాశాలలు ప్రారంభమవ్వడంతో విద్యార్థినులు, యువతులు, మహిళల హాజరు సంఖ్య పెరిగింది. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని రాచకొండ షీటీమ్స్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నది. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు దాదాపు 100 కూడళ్లలో మఫ్టీలో షీటీమ్స్ బృందాలు మోహరిస్తున్నాయి.
యువతుల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడినా, బైక్లను ర్యాష్గా నడిపినా, ఇతర వ్యవహారాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు రిమాండ్కు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13 నుంచి షీ టీమ్స్ స్పెషల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నది. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే డయల్ 100, రాచకొండ వాట్సాప్ నంబర్ -9490617111కు సమాచారం అందించాలని సూచిస్తున్నాయి షీటీమ్స్ బృందాలు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.