పీర్జాదిగూడ, జూన్ 26: మొక్కలు, వృక్షాలు మానవ మనగడకు ఎంతగానో దోహదపడుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం రూపొందించారని మంత్రి పేర్కొన్నారు. ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హరిత పీర్జాదిగూడగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నగరపాలక సంస్థ పరిధి మేడిపల్లి శాంతివనం పార్కులో సుమారు 12 వందల మొక్కలు నాటు వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్రెడ్డి, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్, సీడీఎంఏ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, సునీత భగవత్ ఐఎఫ్ఎస్లతో కలిసి పార్కులో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆకుపచ్చని వనంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికైన హరిత హారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. తెలంగాణలో 33 శాతం పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. అనంతరం, అధికారులతో కలిసి “మొక్కలు నాటు దాం.. వాటిని సంరక్షిద్దాం” అనే నినాదంతో పార్కులో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డీఈ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, శారదా ఈశ్వర్ రెడ్డి, ప్రసన్న లక్ష్మీ శ్రీధర్రెడ్డి, బండి రమ్య సతీశ్ గౌడ్, మంజుల రవీందర్, రాజేశ్వరి, నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు.
చెత్త రహిత కార్పొరేషన్గా తీర్చిదిద్దాలి
చెత్త రహిత కార్పొరేషన్గా తీర్చిదిదేంద్దుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్వచ్చ సర్వేక్షణ – 2022లో భాగంగా స్వచ్ఛ కార్మికులకు, ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ వలంటీర్లకు కార్పొరేషన్ పరిధి సెట్విన్ సెంటర్లో సోర్స్ సేగ్రిగేషన్పై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టడీ టూర్లో భాగంగా ఇండోర్ పట్టణంలో చేపట్టిన తడి, పొడి హానికర చెత్తను వేరు చేయడాన్ని ప్రణాళికాబద్ధంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీంతో పాటు స్వచ్ఛ ఆటోకార్మికులకు అను సంధానంగా ఐటీసీ వారి సహకారం సోర్స్ సేగ్రిగేషన్పై ప్రజలకు అవగాహన కల్పించడం పర్యవేక్షించడం కొరకు 60 మంది స్వచ్ఛంద సేవకులను నియమించడం హర్షనీయమని మంత్రి, సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. వలంటీర్లను అందించిన ఐటీసీ, ఎంఏఆర్ఏ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, ఐటీసీ మారి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ కార్మికులు, వాలీంటీర్లు పాల్గొన్నారు.