హాజరుకానున్న దేశ, విదేశాలకు చెందిన ఐటీ, స్టార్టప్ నిపుణులు, వెంచర్ క్యాపిటలిస్టులు
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఆవిష్కరణల రంగంలో వాట్ నెక్ట్స్.. అంటే తెలంగాణ అనే స్థాయికి తీసుకువెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థాపకతను జ్వాలా ఉద్యమం (ప్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్) పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నది. 10 జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేస్తూ ఆవిష్కరణలపై అవగాహన పెంచేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ 28న టీ హబ్ 2.0(రెందోదశ)ను ప్రారంభించి దేశ స్టార్టప్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా అవతరించనున్నది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రమంతా సరికొత్త ఆవిష్కరణల ద్వారా ఔత్సాహిక వ్యాపార వేత్తలు ఎదిగేందుకు ఉన్న అవకాశాలను చాటి చెబుతున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి మొదలు కొని, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల ప్రభుత్వ యంత్రాంగం ప్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. రెండోదశ టీ హబ్ ప్రారంభమైన తర్వాత దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత అనుకూలమైన ఆవిష్కరణల వ్యవస్థకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలబడేలా సరికొత్త నినాదాన్ని పట్టణ స్థాయి నుంచి పల్లెటూర్ల దాకా తీసుకువెళ్లనున్నారు.
ప్రజ్వలించే ఉద్యమంలా..
దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని ఆవిష్కరణల (ఇన్నోవేషన్స్) నెట్వర్క్ను తెలంగాణ రాష్ట్రంలో ఐటీ శాఖ గత 8 ఏండ్లలో ఏర్పాటు చేసింది. దాని ఫలితమే దేశ, విదేశాల్లో ఆవిష్కరణలకు అత్యంత అనుకూలమైన వాతావరణం (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. దీన్ని మరింతగా విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో (స్టేట్ ఇన్నోవేషన్ సెల్) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. టీ వర్క్స్, వీ హబ్, టాస్క్, రిచ్.. ఇలా రకరకాల ఆవిష్కరణల ద్వారా వ్యాపార సంస్థలను విస్తరించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలకు విసృత్తంగా ప్రచారం చేస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు.
టీ హబ్ సేవలపై గోవా ఐటీ మంత్రి ప్రశంసలు
స్టార్టప్ రంగంలో టీ హబ్ సేవలను గోవా రాష్ట్ర ఐటీ, పర్యాటక శాఖ మంత్రి రోహన్ కౌంటే ప్రశంసించారు. వివిధ రంగాలకు చెందిన సమస్యలకు చక్కని ఆలోచనలతో పరిష్కార మార్గం చూపుతూ వ్యాపార సంస్థలుగా ఎదిగేందుకు టీ హబ్ చేస్తున్న కృషి బాగుందని పేర్కొన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని టీ హబ్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్ రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా రెండో దశ టీ హబ్ (2.0)ను ఎంతో విశాలమైన స్థలంలో ఐటీ కంపెనీల మధ్య నిర్మించిందని, ఈనెల 28న ప్రారంభిస్తున్నామని తెలిపారు.
28న టీ హబ్ ఇన్నోవేషన్ సమ్మిట్
ఐటీ కారిడార్లోని రాయదుర్గం నాలెడ్జ్సిటీలో ఈ నెల 28న రెండో దశ టీ హబ్ (2.0)ను ప్రారంభించిన తర్వాత ఇన్నోవేషన్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్లో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, స్టార్టప్ రంగ నిపుణులతో పాటు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ నెట్ వర్క్
తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టం