గ్రేటర్ పరిధిలో 154 కొవిడ్ పరీక్షా కేంద్రాలు
ప్రతి రోజు 6000 మందికి పరీక్షలు
లక్షణాలున్న వారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి
మాస్కు , భౌతిక దూరం తప్పనిసరి
గ్రేటర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందులో గ్రేటర్ పరిధిలోనే కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మొన్నటి వరకు 100లోపు నమోదైన కేసుల సంఖ్య.. గత రెండు మూడు రోజులుగా 200 దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రజా వైద్య సంచాలకులు కరోనా కేసుల పెరుగుదలతో హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల వైద్యాధికారులు కరోనా బాధితుల గుర్తింపు, నిర్ధారణ పరీక్షలు, పరీక్షా కేంద్రాలు, చికిత్స తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని పీహెచ్సీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభంతో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని, అదే సమయంలో కరోనా రోగుల్లో సైతం ఈ లక్షణాలే కనిపించడంతో అయోమయానికి గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో ఇప్పటికే 154 కొవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసి, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు 6000 మందికి పైగా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో..
హైదరాబాద్ పరిధిలో 89 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 ఏరియా దవాఖానలు, ఉస్మానియా, గాంధీ, ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన తదితర తొమ్మిది టీచింగ్ హాస్పిటల్స్లో ప్రతి రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె.వెంకటి తెలిపారు. ప్రతిరోజు 4000 ర్యాపిడ్ పరీక్షలు, 1000 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలు సేకరించి ర్యాండమ్గా జీనోమ్ సీక్వెన్సింగ్కు సైతం పంపుతున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని, బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రతగా ఉండాలని సూచించారు. కేసుల సంఖ్య ఆధారంగా మరిన్ని పరీక్షా కేంద్రాలను పెంచుతామన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారికోసం గాంధీలో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో హాస్పిటల్ అడ్మిషన్స్ పెద్దగా లేవని డా.వెంకటి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో: డా.స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారి, రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 44 పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు జిల్లా దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. ప్రతిరోజు 1500 మందికి ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు, 100నుంచి 150మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మునుపటిలా ముందుకు రావడం లేదు.
అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. మేడ్చల్ పరిధిలో ప్రతి రోజు దాదాపు 500 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు మూడు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. బయకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. దీనిపై ఇప్పటికే ఆదేశాలు కూడా జారీచేశాం. మాస్కు లేని వారిని దవాఖానల్లో అనుమతించరు. ప్రజలు భౌతిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ కరోనా నియమాలు పాటించాలి. వైరస్పై నిర్లక్ష్యం చేయవద్దు.