చాంద్రాయణగుట్ట, జూన్ 24 : లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ శీరా రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోనాల సందర్భంగా జూలై 3న 150 మంది కళాకారుల బృందంతో కలిసి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరో 60 మంది ఢిల్లీ బయలుదేరుతామన్నారు.4న విలేకరుల సమావేశం, 5 న అమ్మవారి చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం, 6న 108 మంది మహిళ భక్తులతో ఢిల్లీ గేటు నుంచి తెలంగాణ భవన్ వరకు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూలై 15 న లాల్దర్వాజ అమ్మవారి ఆలయం శిఖర పూజ, ధ్వజారోహణతో ప్రారంభమై జూలై 25 న అష్టదశపాద పద్మారాధనతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. సమావేశంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎ.మాణిక్ప్రభుగౌడ్, కె.విష్ణుగౌడ్, బంగ్లా రాజు యాదవ్, బి.మారుతి యాదవ్, సి.వెంకటేశ్, బి.బల్వంత్ యాదవ్, తిరుపతి నర్సింగ్రావు, బద్రీనాథ్గౌడ్ పాల్గొన్నారు.
తెరపైకి మరో కమిటీ సభ్యులు..
నెల రోజులుగా లాల్దర్వాజ అమ్మవారి ఆలయ కమిటీ పేరుతో రెండు గ్రూపులుగా విడిపోయి కమిటీలు ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు రాజ్కుమార్ బృందం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గంటలోపే పోసాని సదానంద్ ముదిరాజ్ గ్రూపు కమిటీ సభ్యులు మా పర్యవేక్షణలోనే బోనాలు జరుగుతాయని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేశారు. నూతన కమిటీలో ఆలయ చైర్మన్గా చెన్నబోయిన శివకుమార్ యాదవ్, వర్కింగ్ చైర్మన్గా పి.సురేందర్ కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు కమిటీలో ఉంటారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ కలిసి కట్టుగా బోనాలు నిర్వహించాలంటే రెండు కమిటీలు రద్దు చేసి ఫోర్మెన్ కమిటీ వేస్తే కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సదానంద్ ముదిరాజ్ వర్గం స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు జరుగకుండా ఉండేందుకు ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని పర్యవేక్షణలో ఎస్సై మహేశ్ బృందం బందోబస్తు ఏర్పాటు చేశారు.