వెంగళరావునగర్, జూన్ 23: నగరంలో గోల్డ్ మాఫియా దాష్టీకం వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా.. నలుగురిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేసింది. తమకు అందాల్సిన బంగారం అందలేదన్న కోపంతో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు.. బంగారం స్మగ్లింగ్ చేసిన మరో ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల పాటు ఓ విల్లాలో నిర్బంధించి ఇనుప రాడ్లతో బాది, కర్రలతో కుళ్లబొడిచారు. వారి బాధలను చూడలేని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు బాధితులను రక్షించారు.
అసలేం జరిగిందంటే…
దుబాయ్ చూడాలన్న యువతను టార్గెట్ చేసుకున్న గోల్డ్ మాఫియా ముఠా నగరంలోని కొందరు యువకులకు ఎరవేసింది. తమ డబ్బుతో దుబాయ్లో ఎంజాయ్ చేయొచ్చని ఆశలు కల్పించింది. 15 రోజుల క్రితం పాతబస్తీకి చెందిన షెహబాజ్, పంజాగుట్ట శ్రీనగర్కాలనీకి చెందిన అయాజ్, సనత్నగర్ అశోక్కాలనీకి చెందిన ఫహద్ను దుబాయ్కి పంపించింది. అక్కడ వారం రోజుల పాటు ఓ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్లో ఆశ్రయం కల్పించింది. వారికి ఖర్చుల కోసం ఒక్కొక్కరికి ప్రతిరోజూ 100 దిర్హామ్స్ కూడా ఇచ్చింది.
6 కిలోల బంగారం అప్పగింత
తిరిగి వచ్చే సమయంలో ఒక్కొక్కరికీ రెండు కిలోల చొప్పున మొత్తం 6 కిలోల బంగారం పేస్టును వారి కాళ్లకు బ్యాండేజీలతో చుట్టారు. వీరిలో అయాజ్, షెహబాజ్ కస్టమ్స్కు చిక్కకుండా బంగారం తీసుకువచ్చి సదరు గ్యాంగ్కు అప్పగించారు. కానీ.. ఫహద్ మాత్రం దుబాయ్ ఎయిర్పోర్టుకు వెళ్లినా.. విమానం ఎక్కకుండా అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. దాంతో దుబాయ్లో ఉన్న ఫహద్ బంధువును కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు అతన్ని చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది.
నలుగురి కిడ్నాప్..
ఫహద్ బంగారం తెచ్చివ్వకపోడంతో ఆగ్రహించిన సదరు ముఠా.. తొలుత అతడి తండ్రి అహ్మద్ షరీఫ్తోపాటు అతడి బంధువు ఆసిమ్ను కూడా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఫహద్తో కలిసి దుబాయ్ ప్రయాణం చేసి తిరిగివచ్చిన షహబాజ్, అయాజ్లను కూడా నిర్బంధించారు. వీరందరినీ పాతబస్తీలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఉన్న విల్లాలో నిర్బంధించారు. నోట్లో గుడ్డలు కుక్కి ఇనుప రాడ్లతో వారిని చితకబాదుతూ చిత్రహింసలకు గురిచేశారు. తమకేమీ తెలియదని చెప్పడంతో ఫహద్ తండ్రి షరీఫ్ మినహా మిగతా వారిని వదిలేశారు. ఈ ముఠా బాధలు భరించలేని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా సమాచారం మేరకు విల్లాపై దాడి చేసి అహ్మద్ షరీఫ్ను రక్షించారు. అయితే అప్పటికే సమాచారం తెలుసుకున్న ఈ గ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుపోయారు.
రౌడీషీటర్ మేనల్లుడే సూత్రధారి
పాతబస్తీకి చెందిన ఓ పేరుమోసిన రౌడీషీటర్ మేనల్లుడే ఈ నెట్వర్క్ సూత్రధారని బాధితులు చెబుతున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ఈ గ్యాంగ్లో 300 మంది ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఎయిర్ పోర్టుల్లో అనుమానం రాకుండా కస్టమ్స్, పోలీసుల కళ్లుగప్పి బంగారాన్ని ఎలా తేవొచ్చనే అంశంపై దుబాయ్లో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బంగారంలో మలినాలను మిశ్రమం చేయడం ద్వారా కస్టమ్స్కు దొరకకుండా జాగ్రత్త పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే..వారిని విడిపించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను సైతం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.