రవీంద్రభారతి, జూన్ 23: తండ్రి స్మృతిలో మంచి కథా సంకలనం తీసుకొచ్చి స్ఫూర్తినివ్వడం చాలా గొప్పగా ఉన్నదని, అందరి హృదయాలను కదలిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అభినందించారు. గురువారం రవీంద్రభారతి పైడి జయరాజ్ థియేటర్లో రచయిత సౌభాగ్య రచించన లోపలిదారి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ.. పుస్తక రచయిత్రి సౌభాగ్యను ప్రత్యేకంగా అభినందించారు.
సభకు అధ్యక్షత వహించిన సినీ దర్శకుడు, కవి రచయిత బి.నర్సింగరావు మాట్లాడుతూ.. జైన, సూఫీ, హిందూ, యూదు, తావో, ఓషో తదితర మహాసాధువులు తత్వవేత్తలు కథలను సంకలనంగా తీసుకురావడం చారిత్రాత్మకంగా ఉన్నదన్నారు. కర్మయోగి రైతు అయిన తండ్రి అల్లపుల్ల రాజులు(మోతె) నాలుగో వర్ధంతిని స్మరించుకుంటూ ఈ సంకలనం తీసుకురావడం ఈ తరానికి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుందని అభినందించారు. రచయిత సౌభాగ్య మాట్లాడుతూ.. ఈ కథలన్నీ జ్ఞాన సిద్ధి పొందిన జ్ఞానుల కథలని, అనంత శక్తికి పూర్తిగా శరణాగతి పొందిన కరుణామయులైన సాధువుల కథలని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో విమర్శకులు వాడ్రేవు చిన వీరభద్రుడు, సినీనటుడు తనికెళ్ల భరణి, సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, గంగారెడ్డి, అన్వేషి ప్రచురణకర్త మహి పాల్గొన్నారు.