సహస్ర శీర్షం దేవం
విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవం
మణికొండ, ఫిబ్రవరి 4 : అక్షరం పరమం పదం ..అంటూ ఆలయంలో పూజారి.. భక్తులకు పుష్పాన్ని ఇచ్చి వేదాంతర్గతమైన మంత్రపుష్పం చదివి తీసుకొని గర్భగుడిలోని దైవానికి తిరిగి సమర్పిస్తారు. దీంతో భగవంతుడి ఆశీస్సులు మన వెంటే ఉంటాయని వేదం చెబుతున్నది. నారాయణుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనేది ఆ వేద మంత్ర తాత్పర్యం. వైదిక ధర్మ శాఖలలో ఒకటైన శ్రీ వైష్ణవంలో ఆళ్వారులకు, ఆ ఆళ్వారులు ప్రవచించిన 108 దివ్య దేశాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటిని అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా కొలుస్తారు. వీటిని సందర్శిస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించి పుణ్యఫలం లభించినట్లేనని వైఖాసన ఆగమం చెబుతున్నది అటువంటి దివ్యదేశాలన్నింటినీ మనం ఇపుడు సమతామూర్తి కొలువై నిలిచిన శ్రీ రామానుజ క్షేత్రంలోనే దర్శనం చేసుకునేలా సహస్రాబ్ది వేడుకల్లో సాలగ్రామయుత మూర్తులను ప్రతిష్ఠస్తున్నారు. పన్నెండు మంది ఆళ్వారులు కూడా ఇక్కడే కొలువు దీరనున్నారు.
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్ ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని శ్రీ చినజీయర్స్వామి అన్నారు. సహస్రాబ్ది మూడవరోజు పూజా కార్యక్రమాల్లో ఆయన యాగశాలలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరేళ్లపాటు నిర్విరామంగా శ్రమించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల కట్టడాలను, ప్రతిష్ఠలను, శాస్ర్తోదికాలను పరిశీలించిన తర్వాత శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో 108 దివ్యదేశాలను ప్రతిష్ఠించుకోవడం ఇక్కడ ప్రజల పుణ్యఫలంగా ఆయన అభివర్ణించారు. దక్షిణభారతంలోనే ముచ్చింతల్ ఓ గొప్ప పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక కలికితురాయిగా నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. భక్తులకు అవసరమైన మరిన్ని వసతులు సమకూర్చిన తర్వాత మనోహర దివ్యక్షేత్రమై వెలుగుతుందని చెప్పారు.
జపాలు.. పారాయణలు
త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యలో వేదపండితులు, రుత్వికులు అత్యంత భక్తి శ్రద్ధలతో మూడోరోజైన శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. యజ్ఞ కుండలాల్లో అష్టాక్షరి జపం పఠిస్తూ యాగం చేశారు. అనంతరం యాగశాలల్లో చిన జీయర్స్వామి పర్యటించారు. జగద్గురు వాసుదేవాచార్య, స్వామి విద్యాభాస్కర్లు భక్తులకు శ్రీరామానుజాచార్యుల వైభవాన్ని వివరించారు. భద్రాచలం నుంచి వచ్చిన శ్రీమాన్ గుడిమోళ్ల మురళీకృష్ణమాచార్య, అథర్వ వేదపండితులతో కలిసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. సప్తస్వర సంగీత అకాడమి వారి ఆధ్వర్యంలో కళాకారులు ప్రజ్ఞ, మనోజ్ఞలు సంగీత ఝరితో ఆకట్టుకున్నారు. సహస్రాబ్ది సమావేశ మందిరంలో సుష్మా, సుస్మిత బృందం గానాలాపన చేశారు. పెద్దబ్రోలు భావన బృందం నృత్యప్రదర్శనలు, శ్రీమాన్ స్థలశాయి యుజుర్వేద పండితుల పుణ్యవచనాలు చేశారు. మానస భజన బృందం స్వామివారి కీర్తనలతో భక్తులను అలరింపచేశారు. రాజమహేంద్రవరం నుంచి విచ్చేసిన రఘునాథ్ భట్టర్ ప్రవచనాలను భక్తులకు వివరించారు. అనంతరం వేదపండితులతో కలిసి త్రిదండి చినజీయర్ స్వామిజీ వెంకన్న స్వామి భజన, విష్ణునామ సహస్ర పారాయణాలు, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి ప్రవచనాలు, వేదాల విశిష్టతను వివరించారు.
సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ను శాశ్వతంగా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్లతో కలిసి ఆయన పర్యటించారు. శ్రీరామనగరంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని ఇకపై శాశ్వతంగా శంషాబాద్ డివిజన్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శంషాబాద్లో పోలీస్ కంట్రోల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించామని ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమంలో శాశ్వతంగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావించి శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నామని సీఎస్ స్పష్టంచేశారు.
శ్రీరామనగరం.. దేదీప్యమానం
నిత్య దీపకాంతులతో వెలుగులీనుతున్న శ్రీరామనగరంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రవచనాల సీడీలు, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేదాలు, ఇతిహాసాలు, శ్రీమద్భగవద్గీత, విష్ణుపురాణం, పద్మ పురాణం, రామాయణం, భాగవతం, హరివంశపర్వము, యజుర్వేద సంహిత, మండకోపనిషత్ వంటి గ్రంథాలన్నీ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభ్యమవుతున్నాయి.
ధ్వని పరీక్ష చేసి..
దివ్యక్షేత్రంలో శ్రీరామానుజాచార్య విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలను నిర్మించడానికి నిర్వాహకులు భారతదేశం మొత్తం పర్యటించారు. ప్రతి దివ్య క్షేత్రాల్లోని మూల విరాట్టులు, గర్భగుడి నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 12 వేల ఫొటోలు, 800 అధునాతన డ్రాయింగులను క్షుణ్నంగా పరిశీలించారు. దివ్యదేశాల స్తంభాల నిర్మాణం, వాటి ఆకృతి కోసం నల్లపాలరాయిని ఉపయోగించారు. రాజస్థాన్లోని బస్లాలా గ్రామం నుంచి రాయిని తీసుకొచ్చి చెక్కి దివ్య దేశాల కోసం 468 స్తంభాలను ఏర్పాటు చేశారు. కాంచీపురం వాలజ్య నుంచి రాయిని పరిశీలించి, విగ్రహాలను చెక్కడానికి ముందు దాని ధ్వనిని పరీక్షించారు. ఆళ్లగడ్డ, తిరుపతి, మహాబలిపురం, శ్రీరంగం, మధురై నుంచి అనేక మంది శిల్పులు ఇక్కడికి వచ్చి దేవాలయాలను తీర్చిదిద్దారు. లోయస్తంభాలు(చిలకలు) నల్ల పాలరాయితో చైనాలో తయారు చేయించారు.
దివ్యత్వం ప్రతిబింబించేలా.. మూర్తులు
ఆలయ నిర్మాణానికి ముందు చినజీయర్ స్వామి వేర్వేరు శిల్పులతో కొన్ని వందల నమూనాలను పరిశీలించారు. 3 నెలల పాటు నిర్విరామంగా డిజైన్లు ఖరారు చేసే పనిలో తలమునకలయ్యారు. ఆగమ శాస్త్రం, శిల్పశాస్త్రం నియమాలను అనుసరించి త్రీడీ నమూనాలను పరిశీలించారు. మూర్తుల ముఖంలో ఆహ్లాదం, కళ్లల్లో దయ స్పష్టంగా కొట్టొచ్చేలా, విగ్రహాల నఖలు(గోర్లు) కూడా అత్యంత సహజంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ మూర్తిని చూసినా దివ్యత్వం ప్రతిబింబించేలా శ్రద్ధ కనబరిచారు.అలాగే రామానుజాచార్యుల ధ్యాన భంగిమ నిర్మాణంలో కూడా చోళ, చాళుక్య, విజయనగర వాస్తు శిల్ప సూత్రాలను అనుసరించారు. 3 దశల్లో ఉండే 54 అడుగుల ఎైత్తెన భద్రవేది పీఠంలో మొదటి దశ చతురస్ర ఆకారంలో రెండు, మూడు దశలు అష్టభుజ ఆకృతిలో నిర్మించారు.
135 అడుగుల త్రిదండం
శ్రీ మద్రామానుజుల పవిత్ర త్రిదండాన్ని శ్రమకోర్చి తీర్చిదిద్దారు. భద్రవేది పీఠం రంగు కోసం బన్సి పహార్పూర్ పింక్ స్టోన్ బలమైన ఇసుకరాయిని ఉపయోగించారు. మౌంట్ అబూ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు దీన్ని నిర్మించారు. భద్రవేది ఎత్తు 54 అడుగులు. వృత్తాకార కమలం 27 అడుగులు. త్రిదండం మొత్తం ఎత్తు 135 అడుగులు. రామానుజ భుజంపై నుంచి ఎత్తు 27 అడుగులు. 6 టన్నుల బరువు(జల పవిత్రం).