సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పచ్చని చెట్లు.. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్లు.. హాయిగా షికారు చేసేందుకు బోట్లు.. ఇలా నగర చెరువులు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా శోభిల్లుతున్నాయి. ఒకప్పుడు కళావిహీనంగా ఉన్న తటాకాలు నేడు కళకళలాడుతున్నాయి. ఇలా చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో స్ఫూర్తి పొందుతున్న పలు కార్పొరేట్ సంస్థలు ఈ మహత్తర యజ్ఞంలో మేముసైతమంటూ ముందుకొస్తున్నాయి. చెరువుల బాధ్యతను భుజాన వేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు సీఎస్ఆర్ కింద పది చెరువుల రక్షణ, సుందరీకరణ పనులు చేపడుతున్నాయి. తాజాగా మరికొన్ని సంస్థలు 25 చెరువులను దత్త్తత తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని.. ఆయా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నది బల్దియా.
చెరువుల పరిరక్షణలో మేం సైతం అంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రభుత్వ చర్యలకు తమ వంతుగా భాగస్వామ్యం అవుతామంటూ నిర్మాణ రంగ సంస్థలు, పలువురు కంపెనీలు చేయూతనందిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే దుర్గం చెరువును ఐటీ రహేజా కంపెనీ, ఖాజాగూడ లేక్ తదితర పది చెరువులను పలు సంస్థలు దత్తత తీసుకుని పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపడుతున్నాయి.
సర్కారు స్ఫూర్తిని అందుకున్న కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా పలు చెరువుల అభివృద్ధిని భుజాన వేసుకోవడం శుభపరిణామం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ నిర్మాణ రంగ సంస్థలు 25 చెరువుల అభివృద్ధి-సుందరీకరణకు ముందుకు రావడంతో ప్రైవేటుపరంగానూ చెరువులు పునర్ వైభవాన్ని పొందనున్నాయి.. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆవాసాలను వరద ముంచెత్తకుండా కూడా చెరువుల అభివృద్ధి దోహదపడుతుంది. ఈ మేరకు 25 చెరువుల దత్తతకు సంబంధించి త్వరలో జరిగే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆయా కంపెనీలతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
షరతులు వర్తిస్తాయి..