బంజారాహిల్స్,జూన్ 22: సమాజంలో అణిచివేయబడిన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా వారిని ఎదిగేలా చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు తొలివిడతలో భాగంగా ఎంపికైన 100మంది లబ్ధిదారుల్లో రవాణ వాహనాలను ఎంచుకున్న వారికి బుధవారం జిల్లా కలెక్టర్ శర్మన్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావుతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ వాహనాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఉన్నతస్థాయిలోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో సీఎం సాహోసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రారంభించారన్నారు.
హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం ప్రారంభించారని నోటికి వచ్చినట్లు మాట్లాడిన ప్రతిపక్ష పార్టీల నోరు మూతపడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలుచేస్తున్నారన్నారు. తొలివిడతలో 100మందికి దళితబంధు పథకాన్ని అందిస్తున్నామన్నారు. ఇప్పటికే లబ్ధ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్నారు. కాగా రెండో విడతలో మరో 1500మందికి దళితబంధు అందిస్తామన్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న , కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, సంగీతాయాదవ్, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు,రాములు చౌహాన్, డా.బీఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్ రావుల విజయ్కుమార్, అరుణ్కుమార్, చంద్రశేఖర్,షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో పుట్టడమే అదృష్టమనుకునేలా..
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను చూస్తున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడమే అదృష్టమనే భావనలో ఉన్నారని ప్రభుత్వ విప్. ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు అన్నారు. డా.బీఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఎన్నో పథకాలను సీఎం ప్రారంభించారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టడంతో పాటు మార్కెట్ కమిటీల్లో, వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు.