సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ);హుస్సేన్సాగర్ జలాల్లో నూతన సచివాలయం ప్రతిబింబం స్పష్టంగా కనిపించాలి. అది చూసి సందర్శకులు సరికొత్త అనుభూతిని పొందాలి. తెలంగాణ రాష్ర్టానికే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆధునిక సచివాలయం… పరిపాలనకే పరిమితం కాకుండా పర్యాటకంగానూ ప్రసిద్ధి చెందాలి. దేశ.విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా సాగర తీరం కొలువై ఉండాలి. ప్రస్తుతం సచివాలయం చుట్టు ఉన్న ప్రాంతాలను సరికొత్తగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సచివాలయం చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ సమూలంగా మార్చేస్తూ సరికొత్త ల్యాండ్ స్కేపింగ్తో పార్కులను, ఇతర ఆకర్షణీయమైన ప్రదేశాలను తీర్చిదిద్దాలి.
కొత్త సచివాలయం నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చే సమయానికి హుస్సేన్సాగర్ తీర ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నారు. సచివాలయం అద్భుతమైన నిర్మాణ శైలిని హుస్సేన్సాగర్ తీరానికి వచ్చే సందర్శకులు చూసి ఆస్వాదించేలా ఆప్రాంతాన్ని ల్యాండ్ స్కేపింగ్తో తీర్చిదిద్దనున్నారు. లుంబినీ పార్కు ముఖంగా, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండే సచివాలయానికి ముం దుభాగంలో నీటితో కూడిన సాగరతీరం కనిపించేలా సరికొత్త డిజైన్లను ల్కాండ్ స్కేపింగ్ ఆర్కిటెక్టులతో రూపొందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వారం రోజులుగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో హెచ్ఎండీఏ అధికారులు సమావేశమై చర్చించారు.
సాగర్ జలాల్లో బోటింగ్..
హుస్సేన్సాగర్లో క్రూయిజ్ బోట్ సేవలను అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే ఆర్యతార క్రూయిజ్ పేరుతో కొత్తగా ఒక బోటును పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. సాగర్ జలాల్లో బోటు షికారు ఆహ్లాదభరితంగా ఉండేందుకు ప్రత్యేకంగా టూరిజం శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. బోటింగ్తో పాటు సాగర్ జలాల్లో నీటి క్రీడలను నిర్వహణను తరచూ నిర్వహిస్తూ నగర వాసులకే కాకుండా దేశ,విదేశాల నుంచి వచ్చే వారికి సాగర తీరం సరికొత్త అనుభూతినిచ్చేలా చేస్తున్నారు. మొత్తంగా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహనగరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోంది.
278 అడుగుల ఎత్తులో సచివాలయం..
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో 278 ఎత్తులో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణంలో ఉంది. చారిత్రాత్మక నిర్మాణ శైలితో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న సచివాలయాన్ని దృష్టిలో పెట్టుకొని సాగర్ తీరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దే ప్రణాళికలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధం చేస్తోంది. సాగర తీరంలో, సచివాలయం ముందున్న లుంబినీపార్కు, ఉత్తర భాగంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, ఆ పక్కనే నిర్మాణం అవుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, లుంబినీ పార్కు పక్కనే నిర్మాణంలో అమరవీరుల స్థూపం… ఇలా అన్నింటి రూపురేఖలను సమూలంగా మార్చేలా హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది.