సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈవోడబ్ల్యూ)ను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా చేసే కార్యకలాపాలను అణచివేసేందుకు కార్యాచరణను రూపొందించారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం అధికారులు సమర్థవంతంగా పని చేసే విధంగా నైపుణ్యాన్ని పెంచుతున్నారు.
ఫోర్జరీ పత్రాల సృష్టితో పాటు తప్పుడు పత్రాలతో అమాయకులను బెదిరించి వారి స్థలాలలో భవనాలు నిర్మించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ తప్పుడు పనులకు సంబంధం ఉన్న ప్రతి ఒకరికీ చట్టపరంగా శిక్షలు పడేలా ఓ ప్రక్రియను రూపొందించారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలతో పాటు ల్యాండ్ మాఫియా ఆగడాలపై వస్తున్న ఫిర్యాదులను సైతం సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
స్థలం కబ్జా.. ఐదంతస్తుల భవన నిర్మాణం
సైబరాబాద్ పరిధిలోని ఖరీదైన ఓ ప్రాంతంలో బాధితుడికి కొంత స్థలం ఉంది. స్థల యజమాని విదేశాల్లో ఉన్నాడు. ఇటీవల వచ్చిన యజమాని తన స్థలంలో 5 అంతస్తుల భవనం నిర్మించి ఉండటం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన స్థలానికి సంబంధించిన పూర్తి పత్రాలను పోలీసులకు సమర్పించాడు. తప్పుడు పత్రాలు సృష్టించి తన స్థలంలో భవనం నిర్మించారని బాధితుడు పోలీసులకు తెలిపారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ఈవోడబ్ల్యూ విభాగానికి అప్పగించారు. రంగంలోకి దిగిన ఈవోడబ్ల్యూ బృందం నిపుణుల సలహాలతో పూర్తి ఆధారాలు సేకరించింది. త్వరలో దీని వెనుకాల ఉన్న ల్యాండ్ మాఫియాను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది.
రామచంద్రాపురంలోనూ..
ఈవోడబ్ల్యూ అధికారులు చేసే పకడ్బంది దర్యాప్తు బాధితుడికి ఊరటను ఇవ్వడంతో పాటు అతడికి ప్రాథమికంగా చట్టపరమైన చిక్కులను తొలగించే అవకాశం కూడా ఉంది. కొన్ని నెలల కిందట ఈవోడబ్ల్యూ అధికారులు రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కేసు దర్యాప్తు చేశారు. కొందరు నకిలీ పత్రాలతో వెయ్యి గజాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. బాధితుడికి తిరిగి స్థలం దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు.