సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. వర్షాకాలం ప్రారంభమవ్వడంతో పొంచి ఉన్న సీజనల్ ముప్పు, మరో పక్క పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
డెంగీ కేసుల నమోదుతో అప్రమత్తం
సీజనల్ ప్రారంభానికి ముందే డెంగీ కేసులు నమోదవుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైనట్లు డా.వెంకటి తెలిపారు. సీజనల్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు ముమ్మరం చేశామన్నారు. సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్స్తో పాటు డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడం సహజమని, వీటిని ప్రతి సంవత్సరం ఆరోగ్యశాఖ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నదని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు కూడా నమోదవుతుండటంతో సీజనల్, కరోనా కేసుల్లో స్వల్ప అయోమయం ఏర్పడే అవకాశముందని, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
మూడు రోజుల్లో తగ్గకపోతే
సీజన్లో వచ్చే జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న రోగులకు స్థానిక ఆరోగ్య కేంద్రాల్లోనే సీజనల్ పరీక్షలు జరిపి, మందులు ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డా.వెంకటి తెలిపారు. అంతేకాకుండా రోగికి మూడు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
259 బస్తీ దవాఖానలు, 177 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు
గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానలు, 177 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు జిల్లా దవాఖానల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి చికిత్స, నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వైద్యాధికారి డా.వెంకటి తెలిపారు. అన్ని బస్తీ దవాఖానల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఇప్పటికే కిట్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వే జరుపుతున్నామని, దోమల నివారణ కోసం ఎంటమాలజి విభాగంతో పాటు జీహెచ్ఎంసీతో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యాంటి లార్వా, ఫాగింగ్, డ్రైడే వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాలు, బస్తీలలో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, బస్తీ దవాఖానల్లోనే డెంగీ బాధితులకు పూర్తిస్థాయి చికిత్స అందిస్తామని చెప్పారు.