సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా నమోదవుతున్న కేసుల్లో సివియారిటీ ఏ మాత్రం కనిపించడంలేదని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మాత్రం వైరస్కు గురై దవాఖానలో చేరుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయరాదంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో సివియారిటీ లేకపోవడం, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో చాలా మంది పట్టించు కోవడంలేదని, ఇది ఆరోగ్యానికి క్షేమం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇమ్యూనిటీ బాగా ఉన్నవారికి వైరస్ ప్రభావం లేకపోయినప్పటికీ, వారి వల్ల ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులు, ప్రధానంగా కిడ్నీ, గుండె, కాలేయం సంబంధిత వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకు వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.
అదేవిధంగా.. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా బీఏ 4, బీఏ 5 కేసులు ఉంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రెండు వేరియంట్లు కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన బీఏ1, బీఏ2 మిశ్రమం కావడంతో కొత్త వేరియంట్ల వల్ల ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేదని, జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో జూలై మాసంలో కేసుల సంఖ్య కొంత పెరిగే అవకాశం లేకపోలేదని, ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.