సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ప్రాచీన, అమూల్యమైన యోగ శాస్ర్తాన్ని ప్రపంచానికి బహుమతిగా భారత్ అందించిందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయు డు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం జరిగిన ప్రపంచ యోగా వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. యోగాకు అంతరాలు లేవని, యోగా సార్వజనీనమైనదని ఆయన పేర్కొన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు, ప్రముఖ నటుడు అడివిశేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత , తదితరులు పాల్గొన్నారు.
యోగా సాధనతో మంచి ఫలితాలు:యోగా ప్రాముఖ్యతను వివరించిన సద్గురు జగ్గీ వాసుదేవ్
యోగా ప్రజల జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, ప్రకృతిలో మమేకం కావడానికి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు అందిస్తూ… చేసే పనిలో నిగ్రహం నెరవేర్పును ఒకటి చేస్తుందని సద్గురు జగ్గీ వాసుదేవ్ వివరించారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురసరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో యోగా ఫర్ హ్యూమానిటీ అనే థీమ్ తో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ వర్చువల్ పద్ధతిలో ఉద్యోగులకు యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. రోజురోజుకు భూమిపైన తగ్గిపోతున్న మట్టి ని రక్షించుకునేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందేశాన్ని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అడ్మిన్ సరోజ, సెక్రటరీ లక్ష్మి, ఏసీపీ తులసీరామ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ, ఐఎంఈ సెంటర్లో జరిగిన యోగా కార్యక్రమంలో మిలటరీ, రక్షణ రంగ సంస్థల సిబ్బంది యోగాసనాలు వేశారు.
సిటీ సివిల్ కోర్టులో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రేణుక యార, రెండో అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకరరావు, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి కె.మురళీమోహన్, అదనపు చీఫ్ జడ్జిలు శ్రీనివాసరెడ్డి, పట్టాభిరామరావు, సరిత, సునీతరవీంద్రరెడ్డి, శారద దేవి, రోజరమణి, పరిపాలనాధికారి గురుప్రకాశ్ పాల్గొన్నారు.
కోఠిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ యోగా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, యోగా కేంద్రం డైరెక్టర్ రవీంద్ర కపాడియా, శిక్షకుడు షపాలి కపాడియా, ఆర్తి, తదితరులు పాల్గొన్నారు.