బంజారాహిల్స్, ఫిబ్రవరి 4 : నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని దిల్ సంస్థ స్థలాలను పరిశీలించారు. దక్కన్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్(దిల్) సంస్థ ఆధీనంలో ఉన్న ఎన్నో ఎకరాల స్థలం ఇప్పటికే అన్యాక్రాంతమైదని, మిగిలిన స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. హెచ్ఎండీఏ, రెవెన్యూ ఆధీనంలో ఉన్న 11ఎకరాల స్థలాన్ని వెంటనే జీహెచ్ఎంసీకి బదిలీ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని షేక్పేట మండల తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డిని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. జీహెచ్ఎంసీకి ఈ స్థలాన్ని అప్పగిస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించవచ్చని చెప్పారు. జూబ్లీహిల్స్ సొసైటీ ప్రాంతంలో ఉన్న దోబీఘాట్ను తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలనీ దిగువ భాగంలోఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో కబ్జాకు గురవుతున్నదని, రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని మేయర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ రవికిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
లంగర్హౌస్ చెరువు, హుడా పార్కు సుందరీకరణ పనులు చేపట్టాలి
లంగర్హౌస్ చెరువు, హుడా పార్కు సుందరీకరణ పనులను వెంటనే చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె లంగర్హౌస్ హుడా పార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చెరువులోని గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మేయర్ వెంట ఎంటమాలజి అధికారి రాంబాబు, జోనల్ కమిషనర్ రవికిరణ్, యూసీడీ విభాగం అధికారులు ఉన్నారు.