ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్తో ఈసారి వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసనాలు వేసేందుకు పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వేదికలు సిద్ధం చేశారు. పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ నగరంలోనూ పలు సంస్థలు ప్రత్యేకంగా యోగాడేను ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా డేను నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ రెండు చోట్ల మాత్రమే కాకుండా నగరంలోని పలువురు యోగా క్లబ్ల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలు తమ పరిధిలో యోగాడేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు నిర్వహించలేకపోయారు. పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో యోగా డేను ఘనంగా నిర్వహిస్తున్నారు.
యోగాడే వేడుకలకు ఉపరాష్ట్రపతి….
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న యోగా డే వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి వచ్చే మార్గంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 6.20 నిమిషాలకు తన నివాసం నుంచి బయలుదేరి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి హాజరవుతారు, ఉదయం 7.30 గంటలకు అక్కడి నుంచి జుబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈ సందర్బంగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.