సికంద్రాబాద్, జూన్ 20 : తెలంగాణ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్లు చెప్పారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై మహిళలకు ఎమ్మెల్యే సాయన్న అవగాహన కల్పించారు. నియోజకవర్గంలో ఇప్పటికే దళితబంధు పథకానికి అర్హులైన దళితులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా సుమారు 1500 మంది దళితులకు పథకాన్ని అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని, అర్హులైన వారికి పథకాలు చేరే విధంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చే విధంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
బస్తీలోని నేతలు స్థానికులు పథకాలు సద్వినియోగం చేసుకునే విధంగా చొరవ తీసుకోవాలని, ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వివిధ రంగాల్లో రాష్ట్రం చేస్తున్న ప్రగతి, అమలు చేస్తున్న పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నట్లు చెప్పారు. ఎన్నో కార్యక్రమాలకు తెలంగాణ నాంది పలకడం ద్వారా దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. అదేవిధంగా దాదాపు రూ.135 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు ముప్పిడి మధుకర్, భాస్కర్ ముదిరాజ్, శ్రీహరి, మహంకాళి శర్విన్, తేజ్పాల్, నరేశ్, మురళీయాదవ్, నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.