సికింద్రాబాద్, జనవరి 31: కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. రాష్ట్ర సర్కారు కంటోన్మెంట్కు అందిస్తున్న చేయూతతో ప్రజల్లో నూతనోత్సాహం వెల్లువిరుస్తుంది. ఉచిత తాగునీటి పథకానికి రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కంటోన్మెంట్ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా తాగునీటి అమలుతో కంటోన్మెంట్ పరిధిలో సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెం ట్లో కూడా తాగునీటి పథకం అమలుకు లైన్క్లియర్ కావడంతో గత రెండు రోజులుగా ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యుల నేతృత్వంలో కంటోన్మెం ట్లోని ప్రతి బస్తీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బోయిన్పల్లి, కార్ఖానా, మడ్ఫోర్ట్, బొల్లారం, తిరుమలగిరి, పికెట్ ప్రాంతాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్తీవాసులు క్షీరాభిషేకాలు చేశారు. మరోవైపు కంటోన్మెంట్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో త్వరలోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్యాట్నీ నాలా పనుల కోసం రూ.10 కోట్లు కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టనుంది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
కంటోన్మెంట్ వాసులకు ఉచిత తాగునీటి పథకం అమలుకు శ్రీకారం చుట్టిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్. కంటోన్మెంట్కు ఉచిత తాగునీటి పథకం అమలు చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎంకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. కంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించేందు కు కంకణం కట్టుకున్న సీఎం, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. రెండు రోజుల్లో ఉచిత వాటర్ స్కీమ్కు సంబంధించి విధివిధానాలు ఖరారు కానున్నాయి.