ఘట్కేసర్, జూన్ 14 : పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయని జిల్లాఅదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పోచారం మున్సిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తిస్తూ.. అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయని అన్నారు.
మంగళవారం పోచారం మున్సిపాలిటీలోని 11వ వార్డులో రూ.4లక్షల వ్యయంతో చేపట్టిన భూగర్భ మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. అనంతరం 15వ వార్డు నారపల్లిలోని టీచర్స్ కాలనీలో మొక్కలను నాటి పెంచుతున్న శ్రీమతి సిందూజ, రాజేశ్ జంటను వార్డు టీఆర్ఎస్ నాయకులు అబ్బవతి నర్సింహ, స్వామిలతో కలిసి సత్కరించి మొక్కను అందజేశారు. కమిషనర్ సురేశ్, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, కౌన్సిలర్లు లక్ష్మి, శ్రీలత, నాయకులు శేఖర్, మేనేజర్ నర్సింహులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.