ఎల్బీనగర్, జూన్ 12: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా, లో ఓల్టేజీ సమస్యల లేకుండా చూసేందుకు నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సరూర్నగర్ విద్యుత్ డీఈ శ్రీనివాస్తో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం వ్యాప్తంగా అవసరం ఉన్న అన్ని ప్రాంతాల్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతో పాటు నూతన కరెంటు స్తంభాలు, లో ఓల్టేజీ సమస్యలు తొలగించడంతో పాటు త్రీ ఫేజ్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారి రఘుమారెడ్డితో రూ.1కోటి మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. అంతేకాక నూతన కరెంటు స్తంభాల కోసం రూ.1.20కోట్లు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు.
మన్సూరాబాద్ డివిజన్ వీరన్నగుట్ట ప్రాంతంలో నివాసం ఉండే వారికి కొందరికే కరెంటు మీటర్లు ఉన్నాయని, అందరికీ కరెంటు మీటర్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. గుట్టపైన కొందరు వికలాంగుల స్థలాలు గుట్టపై ఉండటంతో కొందరు ఈ స్థలాలు కబ్జా చేసేందుకు చూస్తున్నందున వారి వద్ద పత్రాలను పరిశీలించి అర్హులైన వారికే కరెంటు మీటర్లు ఇవ్వాలన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పుకు మిగిలిన అందరు పేదలకు కరెంటు మీటర్లు ఇవ్వక పోవడం సరికాదన్నారు. వీరన్నగుట్టలో లో ఓల్టేజీ సమస్య నివారించేందుకు రెండు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ఫతుల్లగూడలో రెండు నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన కాలనీల్లో త్రీ ఫేజ్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.