వెంగళరావునగర్, జూన్ 11 : సమస్యల గురించి ఫోన్లు చేసినా వాటర్ వర్క్స్ అధికారులు ఫోన్లు రిసీవ్ చేసుకోరని…పని చేయరంటూ ఎల్లారెడ్డిగూడ కీర్తి అపార్ట్మెంట్ వాసులంతా కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఫిర్యాదు చేశారు. శనివారం సోమాజిగూడ డివిజన్,సాయిసారధి నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిగూడోలని కీర్తీ అపార్ట్మెంట్స్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలో 8 అడుగుల లోపాలున్న సీవరేజ్ పైపులైన్ ధ్వంసమైందని.. ఆ పైపులైన్ను బాగు చేయాలని ఎమ్మెల్యే మాగంటి దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ వర్క్స్ డీజీఎం దిలీప్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.
సారధి స్టూడియో వైపు నుంచి రోడ్డు అవతలివైపునకు సీవరేజ్ పైపులైన్ను పునరుద్ధ్దరిస్తామని డీజీఎం హామీ ఇచ్చారు. తాము ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎల్లారెడ్డిగూడ వాటర్వర్క్స్ మేనేజర్ మమత ఫోన్ రిసీవ్ చేసుకోరని..దాంతో వారి కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా పని చేసి వెళ్తున్నారే తప్ప శాశ్వతంగా సమస్యను పరిష్కరించడం లేదని ఎమ్మెల్యే మాగంటి దృష్టికి తెచ్చారు. దీంతో వాటర్ వర్క్స్ డీజీఎం స్పందిస్తూ సమస్య ఏదైనా ఉంటే తనకు ఫోన్ చేస్తే పరిష్కరిస్తానని స్థానికులకు ఎమ్మెల్యే ఎదుట హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, కాలనీ సభ్యులు కాట్రగడ్డ రమేష్ , కృష్ణప్రసాద్, జీహెచ్ఎంసీ డీఈ చైతన్య, నాయకులు శరత్ గౌడ్, మధుయాదవ్, మారుతి, రాణి, కవిత పాల్గొన్నారు.