మన్సూరాబాద్, జూన్ 5 : పోలీసుల పేరుతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.80వేల విలువైన 16 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.11 వేల నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా, డిండి మండలం, టి.గౌరారం గ్రామానికి చెందిన రమావత్ నరేశ్ ప్రస్తుతం ఉప్పల్, రామంతాపూర్లో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోక పోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. బస్టాఫ్లలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వృద్ధులపై కన్నేస్తాడు. వృద్ధుల వద్దకు వెళ్లి తాను పోలీసునని.. మీపై లైంగిక దాడి కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయని బయపెట్టి తన వెంట పోలీస్స్టేషన్కు రావాలని బెదిరిస్తాడు.
ఆటోలో ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లిన అనంతరం వృద్ధుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను అపహరిస్తాడు. ఈ విధంగా రాచకొండ కమిషరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 18 కేసులు ఉన్నాయి. 2019, 2021లో రెండు పర్యాయాలు రమావత్ నరేశ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి గత నెల 28న విడుదలయ్యాడు. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఓ వృద్ధుడిని, చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇద్దరు వృద్ధులను పోలీసుల పేరుతో బెదిరించి ఆటో ఎక్కించుకుని దోపిడీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాలతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఉప్పల్, రామంతాపూర్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాల విషయం బయటపడింది. ఈ మేరకు నరేశ్ను రిమాండ్కు తరలించారు.