జూబ్లీహిల్స్, జనవరి 28 : సెంట్రల్ లైటింగ్ సిస్టం కార్మికనగర్ రహదారిలో దేదీప్యమైన వెలుగులు పంచుతోంది. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల చొరవతో ఇప్పటికే అనూహ్య రీతిలో అభివృద్ధి చెందిన కార్మికనగర్ మరిన్ని కొత్త సొబగులు అద్దుకోనున్నది. ఈ రహదారిపై ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంకు మరింత అందాన్నిచ్చే స్ట్రిప్ లైటింగ్తో కొత్తందాలు సంతరించుకోనున్నాయి. రహ్మత్నగర్ డివిజన్లో ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు గణనీయమైన అభివృద్ధి పనులు చేపట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి యూసుఫ్గూడ మీదుగా బోరబండకు వెళ్లే ఈ ప్రధాన రహదారిని ఇటీవల డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ఇరువైపులా సీసీ రోడ్లు, వరద నీటి కాలువలు, ఫుట్పాత్లు, గ్రీనరీ, డివైడర్లు.. వాటిపై అందమైన బొమ్మలు.. ఇలా కార్మికనగర్ రూపురేఖలే మార్చేశారు. ఇందులో భాగంగానే కార్మికనగర్లో రూ.8.32 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. విశాలమైన డబుల్ సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా ఆ లైటింగ్కు మరింత వన్నె తెచ్చేలా స్ట్రిప్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇక్కడ ఏర్పాటు చేసిన 22 సెంట్రల్ లైటింగ్ పోల్స్కు స్ట్రిప్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.3.81 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ప్రతిపాదనలతో కార్మికనగర్ రహదారితో పాటు డివిజన్లోని కేసీఆర్ నగర్, బంగారు మైసమ్మ టెంపుల్, సంతోష్గిరి చౌరస్తాలో మినీ మాస్ లైటింగ్ను ఏర్పాటుచేస్తున్న అధికారులు తాజాగా వాటితో పాటు ఈ ఆధునిక వీధి దీపాలన్నింటికీ స్ట్రిప్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
వేగంగా పనులు
యూసుఫ్గూడ సర్కిల్లో ఆధునిక వీధి దీపాల ఏర్పాటు పనులు వేగంగా చేపడుతున్నాం. సెంట్రల్ లైటింగ్ సిస్టంకు మరింత వన్నె తెచ్చేలా స్ట్రిప్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు గానూ చేసిన ప్రతిపాదనలు ఆమోదం పొందగానే పనులు చేపడతాం. ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ ఆదేశాలతో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము.