సికింద్రాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో 2016 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త డాక్టర్లకు శుభవార్త అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో వెయ్యి మంది డాక్టర్ల నియామకాలను చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, విద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తదితరులు పాల్గొన్నారు.
– బన్సీలాల్పేట, జూన్ 4