గౌతంనగర్, జనవరి28: వర్షాలతో వచ్చే వరదనీటితో ముప్పు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కోసం నాలా అభివృద్ధి పథకం(సీఆర్ఎంపీ) పేరిట రాష్ట్ర ప్రభుత్వం కుషాయిగూడ డిపో నుంచి మౌలాలి వరకు రూ.1.60 కోట్లతో పనులు చేపట్టి 90 శాతం మేరకు పూర్తి చేసింది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు మౌలాలి నుంచి కుషాయిగూడ డిపో వరకు ఉన్న ప్రధాన రోడ్డు మార్గం వరద ముంపునకు గురవుతున్నది. దీంతో మౌలాలి నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. స్థానిక కాలనీ, బస్తీవాసులు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించి, కుషాయిగూడ డిపో నుంచి ఎస్పీనగర్, మౌలాలి యునానీ దవాఖాన చౌరస్తా జంక్షన్ వరకు వరద నీరు సాఫీగా వెళ్లేందుకు పనులు చేయించారు. భూగర్భడ్రైనేజీ పనుల్లో 1000 డయా ఆర్సీసీ పైపులైన్ వేయించారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభించినందుకు స్థానిక కాలనీ, బస్తీవాసులతో పాటు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ప్రాంతాలకు చెక్ …
మల్కాజిగిరి సర్కిల్లో ఎక్కువ శాతం వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా నాలాలు కబ్జా చేశారు. దీంతో ఈ ప్రాంతం వరద ముంపునకు గురవుతున్నది. ఎవరికీ నష్టం కలుగకుండా ప్రణాళికాబద్ధంగా నాలాలు అభివృద్ధి చేస్తున్నాం. ఆర్సీసీ డ్రైన్తో పాటు బాక్స్డ్రైన్ నిర్మాణం చేస్తున్నాం. ఇందుకు ప్రజలు సహకరించాలి.నాలాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. బండ చెరువు దిగువ ప్రాంతాల్లో, దీన్దయాల్నగర్, జ్యోతినగర్ నాలా పనులు 90 శాతం పనులు పూర్తి చేశాం. చాలా వరకు వరద ముంపు నుంచి విముక్తి కలిగింది. త్వరలోనే మిగతా పనులు పూర్తి చేస్తాం.
-ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు