సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఈనెల 29న (ఆదివారం) పలు మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి.
రద్దయిన మార్గాల్లో సిటీ బస్సులు
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయిన మార్గాల్లో అదనంగా సిటీ బస్సులు నడుపాలని అధికారులు నిర్ణయించారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు (22), సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీ (54), సికింద్రాబాద్ నుంచి బోరబండ (16), చాంద్రాయణగుట్ట నుంచి పటాన్చెరు (108), సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు (84) వరకు అదనపు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు.