బేగంపేట్ మే 28: సికింద్రాబాద్ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం ఉన్న చోట మరో విగ్రహాన్ని పెట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న విగ్రహం యథాస్థానంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం దాత కుటంబసభ్యులు, అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అప్పటి ప్యారడైజ్ థియేటర్ యజమాని అంజయ్యగౌడ్ గాంధీ విగ్రహాన్ని ఇటలీలో పంచ లోహాలతో తయారు చేయించారని మంత్రి గుర్తు చేశారు. నాటి దివంగత ప్రధానమంత్రి నెహ్రూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న విగ్రహాన్ని తొలగించే ప్రసక్తి లేదని, కావాలని కొందరు రాజకీయం చేస్తూ పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విగ్రహం చుట్టూ సుందరీకరణ పనులు చేపడుతామన్నారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, విగ్రహ దాత కుటుంబ సభ్యులు తిరుమలగౌడ్, చంద్రమోహన్గౌడ్ తదితరులు ఉన్నారు.