హయత్నగర్, మే 28: హయత్నగర్ డివిజన్ పరిధిలోని వసంతనగర్ కాలనీలో ఉన్న ‘తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్’ను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం కొనసాగుతున్న శిక్షణ తరగతులను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఎంసెట్, ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. హాస్టల్స్లో ప్రతిరోజూ విద్యార్థులకు అందించే ఆహారం, రుచికరంగా, నాణ్యతగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు వచ్చేవని, ప్రస్తుతం గురుకుల విద్యార్థుల ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్ను అందించాలనే గొప్ప మనస్సుతో గతంలో ఎన్నడూ లేనన్ని గురుకులాలను మంజూరు చేశారని, వాటిల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకులాల సొసైటీ అదనపు కార్యదర్శి సర్వేశ్వర్ రెడ్డి, డిప్యూటీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, ఫ్యాకల్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.