ఎల్బీనగర్, మే 28: లైజాల్ ఫ్లోరింగ్ క్లీనర్, రెడ్ లేబుల్ టీ బ్రాండెడ్లకు నకిలీలను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సరూర్నగర్ సీఐ సీతారాం కథనం ప్రకారం, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ శ్రీకృష్ణానగర్ కాలనీలో రోడ్ నెం:3 ఇంటి నెం: 16-99లోని రెండో అంతస్థులో చేతన్ ప్రజాపతి అనే వ్యక్తి ప్రముఖ బ్రాండ్లైన లైజాల్ ఫ్లోర్ క్లీనర్, రెడ్ లేబుల్ టీ పౌడర్లకు నకిలీలను తయారు చేస్తూ దిల్సుఖ్నగర్ లలితానగర్లోని మహాలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్ లక్ష్మీనారాయణ ద్వారా మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నాడు.
అయితే, ఈ బ్రాండ్లకు సంబంధించిన తయారీదారుల ఆథరైజ్డ్ పర్సన్ బెంగళూరుకు చెందిన దినేశ్ తమ ఉత్పత్తులకు నకిలీలు తయారీ చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతూ తమకు నష్టం కలిగిస్తూ ప్రజలకు అమ్ముతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు నకిలీ వస్తువులు తయారు చేస్తున్న ప్రాంతంలో దాడులు చేసి నకిలీ రెడ్ లేబుల్ టీ పోడర్ 556 ప్యాకెట్లు, లైజాల్ 260 లీటర్లులతో పాటుగా హాల్ ఎయిర్ గన్, లైజాల్ లేబుల్స్ 2 కార్టన్ బాక్స్, ఖాలీ సీసాలు 240, క్యాప్స్ రెండు బ్యాగులు, నకిలీ బిల్ బుక్స్ 5, మారుతీ ఈకో వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.