సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలకు తొలి రోజు సోమవారం 98.80 శాతం విద్యార్థులు హాజరైనట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ నగరంలోని బాలికోన్నత పాఠశాల రెడ్క్రాస్, మాసబ్ట్యాంక్, మౌలానా ఆజాద్ స్కూల్, ఏసీ గార్డ్స్, విజయ మేరీ హైస్కూల్ తదితర పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని పరీక్షల నిర్వహణ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 74,831 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 73,911 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రోహిణి వెల్లడించారు.
920 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. అదే విధంగా.. మల్కాజిగిరి – మేడ్చల్ జిల్లాలో కూడా తొలిరోజు 99.41 శాతం విద్యార్థులకు పరీక్షకు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 282 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి సశీంద్రరావు తెలిపారు, 47,516 మంది విద్యార్థులకు గానూ 47, 057 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను సందర్శించాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ కూడా పరీక్ష కేంద్రాలను సందర్శించి నిర్వహణ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.